హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్టీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) కాలేజీల్లో 2026–-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గురువారం ఎస్టీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 సీవోఈ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో మొత్తం 1,280 సీట్లను భర్తీ చేయనున్నారు.
ఇందుకోసం ‘టీజీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సీవోఈ సెట్ 2026’ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ ఏడాది పదో తరగతి చదివిన ఎస్టీ విద్యార్థులు మాత్రమే tgtwreis.telangana.gov.in వెబ్సైట్లో వచ్చే నెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఎటువంటి ఫీజు లేదన్నారు. వచ్చే నెల 19న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు.
